- YSR తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర
హైదరాబాద్ః వైయస్ఆర్ అడుగుజాడల్లోనే తాము కూడా అక్టోబర్ 20వ తేదీన చేవెళ్ల నుంచి "ప్రజా ప్రస్థానం" మొదలు పెడుతామని YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు శ్రీమతి వైయస్ షర్మిల గారు తెలిపారు. వైయస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తామని ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు భరోసా కల్పిస్తామన్నారు. చేవేళ్ల నుంచి మొదలుకొని తిరిగి చేవెళ్లలో ఈ పాదయాత్ర పూర్తి అవుతుందన్నారు. జీహెచ్ ఎంసీ మినహా మిగతా అన్ని జిల్లాల్లో పాదయాత్ర ఉంటుందని, రాష్ట్రంలోని దాదాపు 90 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి గడపా తడతామన్నారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ..
" గత ఏడేండ్ల కేసీఆర్ పాలనలో 7వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి, కేసీఆర్ మోసం చేశారు. కేవలం 3లక్షల మందికే మాఫీ చేసి, 30లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారు. తెలంగాణలో 91శాతం మంది రైతులకు కనీసం రూ.లక్షన్నర అప్పు ఉన్నట్లు ఓ సర్వే చెబుతోంది. ఈ లెక్కన రైతులందరూ అప్పులపాలయ్యారు. రాష్ట్రంలో 16లక్షల కౌలు రైతులు దిక్కులేకుండా పోయారు. కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి, గత ప్రభుత్వాలు దళితులకు కేటాయించిన అసైన్డు భూములు, పోడు భూములు లాక్కున్నారు. కేసీఆర్ పాలనలో దళితుల మీద దాడులు 800 శాతం పెరిగాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మద్యం అమ్మకాలు 300 శాతం పెరిగితే.. మహిళలపై దాడులు 300 శాతం పెరిగాయి. మద్యం అమ్మకాలు, మహిళలపై దాడులకు ప్రత్యక్ష సంబంధం ఉంది. రాష్ట్రంలో చిన్న పిల్లల మానప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. దీనికి కారణం మద్యం, డ్రగ్స్, గంజాయి. తెలంగాణలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్, గంజాయి అమ్ముడుపోతున్నా, కేసీఆర్ వీటిని అరికట్టడానికి ఏ చర్యా తీసుకోవడం లేదు. బంగారు తెలంగాణ అని చెప్పి, బీరుల తెలంగాణ, బారుల తెలంగాణ, తాగుబోతుల తెలంగాణగా మార్చారు. ఏడేండ్లలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. అవి ఎవరికి ఖర్చు పెట్టారు? ఎవరి జేబుల్లోకి పోయాయి? ప్రభుత్వం ఉద్యోగులకు కూడా సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు. సర్పంచులు అప్పులు చేసి,గ్రామాల్లో పనులు చేస్తే వారికి నిధులు కూడా మంజూరు చేయరు. ఆరోగ్యశ్రీ హాస్పిటళ్లకు డబ్బులు ఇవ్వరు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు నిధులు విడుదల చేయరు. కొత్త కొలువులు ఇవ్వరు... పాత కొలువులకు భరోసా లేదు. కండ్ల ముందే ఖాళీ ఉద్యోగాలు కనిపిస్తున్నా.. నోటిఫికేషన్లు ఇవ్వరు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ కు చీమ కుట్టినట్లు కూడా ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద పోరాడాల్సిన అవసరం ఉంది.
పాదయాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ వైయస్ఆర్ గారు. వైయస్ఆర్ గారి పాదయాత్ర నుంచి పుట్టినవే ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, 108, 104, ఉచిత విద్యుత్ , కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న జలయజ్ఞం. వైయస్ఆర్ గారి పాదయాత్ర నుంచి పుట్టిందే వైయస్ఆర్ సంక్షేమ పాలన. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మేం కూడా అక్టోబరు 20వ తేదీ నుంచి దాదాపు ఏడాది పాటు పాదయాత్ర చేపట్టబోతున్నాం. మా పాదయాత్ర పేరు ‘ప్రజా ప్రస్థాన యాత్ర’. ఈ పాదయాత్రలో సమస్యలు వినడం, తెలుసుకోవడమే కాకుండా ఆ సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం కూడా పాదయాత్ర ఉద్దేశం. ప్రజల సమస్యలు వినడమే కాకుండా వారికి అండగా నిలబడతామని, వారి కోసం పోరాడుతామని, వారికి భరోసా కల్పిస్తూ వైయస్ఆర్ గారి సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తామని, వారికి ఆశ కల్పిస్తూ .. మా పార్టీ సిద్ధాంతాలైన సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.
ఈ ఏడేండ్లలో కేసీఆర్ ప్రతి వర్గాన్ని మోసం చేశారు. ప్రజలు ఏం కోల్పోయారో ప్రజలకు తెలియాల్సి అవసరం ఉంది. వారికి చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. స్వార్థ రాజకీయాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం కేసీఆర్ మన రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారో చెప్తాం. కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎలా అమ్ముడు పోయాయో వివరిస్తాం. ప్రతిపక్షమే లేక ఇక దిక్కే లేక కేసీఆర్ గారికే ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు సేవ చేయడానికి వైయస్ఆర్ తెలంగాణ పార్టీ వచ్చిందని, ఉందని, మేమే ప్రత్యామ్నాయమని ఈ పాదయాత్ర ద్వారా భరోసా కలిగిస్తాం. సరిగ్గా ఈ రోజు నుంచి నెల రోజులు అక్టోబర్ 20వ తేదీన మొదలు పెట్టబోతున్నాం. వైయస్ఆర్ గారు మొదలు పెట్టిన విధంగానే మేం కూడా చేవేళ్లలోనే ఈ పాదయాత్ర మొదలు పెడతాం. జీహెచ్ ఎంసీ మినహాయించి మిగతా అన్ని ఉమ్మడి జిల్లాలు కవర్ చేస్తూ దాదాపు 90 నియోజకవర్గాలను తాకుతూ అన్ని పూర్తి చేసుకుని తిరిగి చేవెళ్లలోనే పాదయాత్రను ముగిస్తాం. ఇంటికో ఉద్యోగమని చెప్పారు కేసీఆర్ గారు. మోసపోయిన నిరుద్యోగులు ఈ రోజు వరకు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు. వారి తరఫున పోరాటం చేయడానికి మేం ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతున్నాం. ఈ లోపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వని పక్షంలో పాదయాత్రలో కూడా ఈ నిరాహార దీక్షలు కొనసాగిస్తాం. ప్రజల కష్టాలు వింటూ వారికి మేం ఉన్నామని, వారి తరఫున పోరాడుతామని వారికి భరోసా కల్పిస్తూ వైయస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తామని ప్రజల్లో ఆశ బతికించడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. "